తిరుపతి జిల్లా
వికీపీడియా నుండి
తిరుపతి జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
విభాగం | రాయలసీమ |
స్థాపన | 2022 ఏప్రిల్ 4 |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
జిల్లా కేంద్రం | తిరుపతి |
విస్తీర్ణం | |
• Total | 9,174 కి.మీ2 (3,542 చ. మై) |
జనాభా | |
• Total | 22,18,000 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
Website | అధికార వెబ్ సైట్ |
తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలలో ఒకటి. జిల్లా కేంద్రం తిరుపతి. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలలో భాగాలతో కలిపి ఈ జిల్లా 2022 ఏప్రిల్ లో ఏర్పడింది. రాయలసీమ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలలో ఇది ఒకటి. జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల వేంకటేశ్వర దేవాలయం, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఇతర చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. జిల్లాలో శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని (సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం) కలిపి ఈ జిల్లాను ఏర్పరచినందున ఆయా జిల్లాల చరిత్రలే దీనికి ఆధారం.[2]
భౌగోళిక స్వరూపం
[మార్చు]ఇది తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అన్నమయ్య జిల్లా,చిత్తూరు జిల్లాలు, ఉత్తరాన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,అన్నమయ్య జిల్లాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, చిత్తూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 9174 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్ర మొత్తం వైశాల్యంలో 5.63 శాతం. జిల్లాలోని పర్వత ప్రాంతం సాధారణ ఎత్తు సముద్ర మట్టంపై 2500 అడుగులు.
గూడురులో మైకా గనులున్నాయి.
పశుపక్ష్యాదులు
[మార్చు]తూర్పు కొండలలో భాగమైన శేషాచల కొండలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వృక్ష, జంతు సంరక్షణ జరుగుతుంది. అంతరించి పోతున్న వృక్షాలను పోషించడమే కాక ఇక్కడ ఔషధ మొక్కల పెంపకం కూడా జరుగుతుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఒక పరిశోధక బృందం ఇక్కడ నిరంతర పరిశోధనలు సాగిస్తున్నది. ఇక్కడ ఇలియాన్ షెల్డి టైల్ అనే కొత్త పామును కనుగొన్నారు. స్లెండర్ కోరల్ స్నేక్ అనే విషపూరిత పామును 2009లో కనుగొన్నారు. ఇది దేశంలో మరెక్కడా కనిపించని అరుదైన పాము. బెట్లుడత ఇది ఇండియన్ జైంట్ స్కైరల్ అని పిలువబడే ఈ ఉడుత బరువు 2.5 కిలోలు ఉంటుంది. బంగ్లాదేశ్, శ్రీ లంకలో ఉండే ఈ ఉడుత భారతదేశంలో ఇది తిరుమల కొండలలో మాత్రమే కనిపిస్తుంది అని పరిశోధకులు అభిప్రాయం. బంగారు బల్లి (గోల్డ్ గెకోగా) పిలువబడే పూర్తి బంగారువర్ణంతో కనిపించే ఈ బల్లి తిరుమల కొండలలో శిలాతోరణం, కపిల తీర్థం వద్ద కనిపిస్తుంది. దేవాంగ పిల్లి (స్లెండర్ లోరీన్)గా పిలువబడే ఈ జంతువు భారతదేశంలో, శ్రీలంకలో కనిపిస్తుంది. తిరుమలలో మాత్రమే కనిపించే ఇది రాత్రివేళలో సంచరిస్తూ కీటకాలను తింటూ చెట్ల కొమ్మల మీద జీవిస్తుంది. ఇక్కడ కనబడే బూడిద రంగు అడవి కోళ్ళు ప్రపంచంలో మరెక్కడా లేవని పరిశోధకుల అభిప్రాయం. శ్రీ వెంటేశ్వర జంతుప్రదర్శనశాలలో వీటి పునరుత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించారు.
రవాణా మౌలిక వసతులు
[మార్చు]రహదారి రవాణా సౌకర్యం
[మార్చు]జాతీయ రహదారులు:
- NH-71 మదనపల్లె - కదిరి
- NH-140 తిరుపతి - పూతలపట్టు.
- NH -716 చెన్నై - ముంబయి
- NH -565 ఏర్పేడు - నకరికల్లు [3]
- రైలు రవాణా సౌకర్యం: జిల్లాలోని రేణిగుంట అతి పెద్ద రైల్వే కూడలి.
- విమాన రవాణా సౌకర్యం: తిరుపతి విమానాశ్రయం.
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లాలో గల విశ్వవిద్యాలయాలు
- శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
- శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
- వేదిక్ విశ్వవిద్యాలయం
- సంస్కృత విశ్వవిద్యాలయం
- స్విమ్స్ (శ్రీ వేంకటేశ్వర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)
పరిపాలనా విభాగాలు
[మార్చు]జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అవి గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుపతి. ఈ రెవెన్యూ డివిజన్లు 34 మండలాలుగా విభజించబడ్డాయి. ఈ జిల్లాలో 822 గ్రామ పంచాయతీలు, 1107 గ్రామాలు ఉన్నాయి.[1]
మండలాలు
[మార్చు]తిరుపతి డివిజన్, సూళ్లూరుపేట డివిజన్లలో ఒక్కొక్కటి 9 మండలాలు, గూడూరు డివిజన్, శ్రీకాళహస్తి డివిజన్లలో 8 మండలాలు ఉన్నాయి . రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 34 మండలాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- గూడూరు డివిజన్
- తిరుపతి డివిజన్
- శ్రీకాళహస్తి డివిజన్
- సూళ్లూరుపేట డివిజన్
గ్రామాలు, గ్రామ పంచాయితీలు
[మార్చు]జిల్లాలో 1107 గ్రామాలు, 822 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
నగరాలు, పట్టణాలు
[మార్చు]జిల్లాలో తిరుపతి నగరం, శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట, పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట పట్టణాలున్నాయి. ఏర్పేడు, సత్యవేడు, పాకాల 2011 జనాభా లెక్కల ప్రకారం జనగణన పట్టణాలుగా నమోదయ్యాయి.
వరుస సంఖ్య | పేరు | పట్టణ స్థానిక సంస్థ రకం | జనాభా
(2011 జనాభా లెక్కలు) |
---|---|---|---|
1 | తిరుపతి | నగర పాలక సంస్థ | 2,87,035 |
2 | శ్రీకాళహస్తి | పురపాలక సంఘం గ్రేడ్ - 1 | 80,056 |
3 | గూడూరు | పురపాలక సంఘం గ్రేడ్ - 1 | 74,047 |
4 | పుత్తూరు | పురపాలక సంఘం గ్రేడ్ - 3 | 54,092 |
5 | వెంకటగిరి | పురపాలక సంఘం గ్రేడ్ - 3 | 52,688 |
6 | సూళ్లూరుపేట | పురపాలక సంఘం గ్రేడ్ - 3 | 41,952 |
7 | నాయుడుపేట | నగర పంచాయతీ | 40,828 |
రాజకీయ విభాగాలు
[మార్చు]లోక్సభ నియోజకవర్గాలు
[మార్చు]తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా, కొన్ని మండలాలకు జిల్లాకేంద్రం దగ్గరగా ఉంచడానికి, జిల్లా పరిధిలో సర్దుబాట్లు చేశారు.
- తిరుపతి (SC) (పాక్షికం), దీనిలోని సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం మండలాలు మాత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి.
- చిత్తూరు (పాక్షికం), దీనిలోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం మండలాలు మాత్రమే ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి.
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]అసెంబ్లీ నియోజకవర్గాలు: (7)
పరిశ్రమలు
[మార్చు]రేణిగుంటలో ఎలాయ్ కాస్టింగ్, ఎస్వి షుగర్స్, అశ్వినీ ఫార్మసీ, సెమీ గవర్నమెంట్ మింటు ఫ్యాక్టరీ ఉన్నాయి. ఇక్కడే రైలు పెట్టెల మరమ్మత్తు కర్మాగారం ఉంది. ఇతర పరిశ్రమలలో కొన్ని:
- శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం.
- అడిదాస్ ఆపాచే, తడ.
- టాటా లెదర్ పార్క్, తడ
- కృష్ణపట్నం ధర్మల్ స్టేషను.
- కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్: ఈ ఓడరేవు ప్రపంచ ప్రసిద్ధ డీప్- వాటర్ పోర్ట్ (లోతైన నీటి రేవు). ఇనుప మిశ్రమ లోహం, గ్రానైట్ కృష్ణపట్నం నుండి చైనా వంటి ఇతర దేశాలకు ఎగుమతి ఔతున్నాయి. వెంకటా చలం నుండి ప్రధాన రైలు మార్గానికి ఇక లింకు ఉంది.
శ్రీసిటీ ప్రత్యేక ఆర్ధిక మండలి
[మార్చు]రాష్ఠ్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా పరిగణిస్తున్న సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలను పారిశ్రామికంగా అభివృద్ధి పరచి, అక్కడి ప్రజలకు ఉపాధిని కల్పించడంతోపాటు, ప్రపంచస్థాయి గుర్తింపు తేవాలన్న ధ్యేయంతో, 2006లో శ్రీసిటీ పేరుతో ఇక్కడ ఒక ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించటానికై ప్రభుత్వం అనుమతించింది. ఆ మండలాల పరిధిలో, ఆంధ్ర- తమిళనాడు రాష్ఠ్రాల దక్షిణ సరిహద్దుకు చేరువలో, బాగా వెనుకబడిన 14 గ్రామాలలోని వ్యవసాయానికి పనికిరాని లేదా అతితక్కువ ఫలసాయం ఇచ్చే భూములలో 2008 ఆగస్టు 8న శ్రీసిటీ ప్రారంభమైనది. అనతి కాలంలోనే వివిధ దేశాలకు చెందిన అనేక భారీ పరిశ్రమల స్థాపనతో, శ్రీసిటీ ప్రగతి ప్రస్థానంలో పరగుతీస్తూ, ప్రపంచ వాణిజ్య పటంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. దేశ, విదేశ సంస్థల ఎగుమతి వాణిజ్య సౌలభ్యం కొరకు 3800 ఎకరాలలో ఏర్పరచిన 'ప్రత్యేక ఆర్థిక మండలి' [Secial Economic Zone (SEZ) - సెజ్], 2200 ఎకరాలలో దేశీయ ఉత్పత్తుల వాణిజ్య కేంద్రం (Domestic Tariff Zone), స్వేచ్ఛావ్యాపారం మరియూ గిడ్డంగి మండలం (Free Trade and Warehousing Zone), వంటి వసతులన్నీ ఒకే చోట ఉండేలా, శ్రీసిటీ నిర్మాణ రూపకల్పన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత జురాంగ్ కన్సల్టెంట్స్ (సింగపూర్) వారిచే రూపొందించబడిన శ్రీసిటీ, ఒక ప్రపంచస్థాయి వ్యాపారకేంద్రానికి ఉండవలసిన అన్ని మౌలిక వసతులనూ, అంతర్జాతీయ జీవన శైలి సదుపాయాలను, హంగులనూ కలిగియున్నది. శ్రీసిటీలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ విశాలమైన రహదారులు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, మంచినీటిశుద్ధి కేంద్రం, సౌర విద్యుత్ కేంద్రము, మురుగు, పారిశ్రామిక వ్యర్ధాల శుద్ధి వసతులు, హరిత వనాలు, నివాస భవన సముదాయాలను నిర్మించారు.
26 దేశాలకు చెందిన 165 కు పైగా కంపెనీలు, సుమారు 25,000 కోట్ల పెట్టుబడితో తమ వ్యాపార కలాపాల నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. వీటిలో దాదాపు 90 పరిశ్రమలు ఉత్పత్తి దశకు చేరుకోగా, మిగిలినవి నిర్మాణ దశలో లేదా ప్రభుత్వ అనుమతులు పొందే దశలో ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, రక్షణ, సౌరశక్తి, ఏరోస్పేస్ పరికరాలు-విడిభాగాల ఉత్పత్తి, భారీ వాహనాలు, ఖనిజాలను వెలికి తీసే యంత్ర సామగ్రి, హార్డ్ వేర్ వంటి బహుళ పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ సంస్థలకు ఇది అనువైనది.
పెప్సీకో, అల్స్టం, కొబెల్కో, కాల్గేట్ పామోలివ్, కెల్లాగ్స్, డేనీల్ ఇండియా, నిట్టాన్ వాల్వ్స్, లావాజ్జా, పయోలాక్స్, వీఅర్వీ, వెస్ట్ ఫార్మా, అస్త్రోటెక్, రాక్వర్త్, ఎవర్టన్ టీ వంటి పలు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. జపాన్ దేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత వాహన ఉత్పత్తి సంస్థ 'ఇసుజు', తన అనుబంధ కంపెనీ 'ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' యొక్క కర్మాగారాన్ని రెండు దశలలో మొత్తం రూ.3000 కోట్ల వ్యయంతో, ఇక్కడ నిర్మించింది. అదేవిధంగా, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మొండెలెజ్ ఇంటర్నేషనల్ సంస్థ, తన అనుబంధ కంపెనీ 'కాడ్బరీ ఇండియా' ను, సుమారు 1000 కోట్ల రూపాయిల పెట్టుబడితో, ఆసియ-పసిఫిక్ ప్రాంతంలోనే అతి పెద్ద చాక్లెట్ల ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించింది. ఆరోగ్య పరిరక్షణకుపకరించే వస్తు వుల తయారీకి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జపాన్ కంపెనీ యూనిచాం ఉత్పత్తి ప్రారంభించింది.
ఈ కంపెనీల రాకతో సుమారు 35000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. ఉపాధి పొందుతున్న వారిలో 50 శాతం మహిళలే. అధిక శాతం మంది మహిళా ఉద్యోగులున్న పరిశ్రమలు అనేకం ఇక్కడున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబన దొరికితే వారి కుటుంబ స్థితిగతులు మెరుగై, పిల్లల భవిష్యత్ బాగుంటుందన్న తలంపుతో మహిళలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడానికి శ్రీసిటీ ప్రణాళికలు రచించింది. తదనుగుణంగా అక్కడి వివిధ పరిశ్రమల యాజమాన్యాలు స్త్రీ శక్తికి అగ్రతాంబూలం ఇచ్చారు, మహిళా శక్తికే పెద్దపీట వేశారు. ఒక్క ఫాక్స్కాన్కు చెందిన రైజింగ్ స్టార్ పరిశ్రమలోనే 11 వేలకు పైగా మహిళలు పనిచేస్తుండగా, మిగిలిన వారు ఎం.ఎస్.ఆర్. గార్మెంట్స్, కెల్లోగ్స్, పాల్స్ ప్లష్, మాండెలెజ్ (క్యాడ్బరీ), ఎవర్టన్ టీ, కాల్గేట్ పామోలివ్, యూనీఛాం, పెప్సికో మొదలైన పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఆయా కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో మహిళలు, సుమారు 20 నుండి 90 శాతం దాకా ఉన్నారు.
సంస్కృతి
[మార్చు]సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకునే పశువుల పండుగ జల్లి కట్టు అంటారు. అప్పుడు జరిగే పార్వేట ఉత్సవం, గంగ పండుగ, ముక్కోటి ఏకాదసి, కావిళ్లు పండుగ, కార్తీక మాసంలో జరిగే సుద్దుల పండుగ, మహాభారత ఉత్సవాలు జిల్లాకు ప్రత్యేకమైన పండుగలు.
దర్శనీయ ప్రదేశాలు
[మార్చు]- తిరుపతి
- శ్రీకాళహస్తి
- శ్రీ వేంకటేశ్వర దేవాలయం, తిరుమల
- పులికాట్ సరస్సు: 500 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఉప్పునీటి సరస్సు.
- నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం: సూళ్ళూరుపేట దగ్గర బూడిదరంగు పెలికన్స్ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
- వెంకటగిరి కోట, వెంకటగిరి
- చంగాళ్లమ్మ గుడి, సూళ్లూరుపేట
- చంద్రగిరి కోట
- సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట
చిత్రమాలిక
[మార్చు]-
తిరుమల దృశ్యం
-
తలయేరు గుండు అలిపిరి
-
చంద్రగిరి కోట, రాజా సౌధం
-
తిరుమల, మ్యూజికల్ ఫౌంటెన్
-
మోకాళ్ళమిట్ట గోపురం, తిరుమల.
-
పులికాట్ సరస్సు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Tirupati District: At a glance". tirupati.ap.gov.in. Retrieved 4 April 2022.
- ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 22 February 2016.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | |
---|---|
రాజధాని | |
జిల్లాలు | అనకాపల్లి · అనంతపురం · అన్నమయ్య · అల్లూరి సీతారామరాజు · ఎన్టీఆర్ · ఏలూరు · కర్నూలు · కాకినాడ · కృష్ణా · గుంటూరు · చిత్తూరు · కోనసీమ · తిరుపతి · తూర్పు గోదావరి · నంద్యాల · పల్నాడు · పశ్చిమ గోదావరి · పార్వతీపురం మన్యం · ప్రకాశం · బాపట్ల · విజయనగరం · విశాఖపట్నం · వైఎస్ఆర్ · శ్రీకాకుళం · నెల్లూరు · శ్రీ సత్యసాయి |
నగరాలు | అనంతపురం · ఏలూరు · ఒంగోలు · కడప · కర్నూలు · కాకినాడ · గుంటూరు · చిత్తూరు · తిరుపతి · నెల్లూరు · మచిలీపట్నం · రాజమహేంద్రవరం · విజయనగరం · విజయవాడ · విశాఖపట్నం · శ్రీకాకుళం (గమనిక: నగర పాలకసంస్థ హోదా ఉన్నవి) |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.